సీనియర్ పాత్రికేయులు ములుగు రాజేశ్వరరావు గారు రాసిన ‘‘నేను-బహువచనం’’ ... ఆత్మకథగా సాగిన వారి పాత్రికేయ జీవిత ప్రస్థానం. వారి తరంలో కొన్ని విలువలకు కట్టుబడి జర్నలిజాన్ని ఆరాధించి బ్రతికిన చాలామంది జర్నలిస్టుల జీవితాలకు ఇది అద్దం పడుతుంది. అయినప్పటికీ రాజేశ్వరరావు గారి వంటి సాత్వికత , ఆత్మాభిమానం , తను నమ్మిన జీవిత విధానం పట్ల మొక్కవోని అభిమానం ఉన్నవారు నూటికి ఒకరు ఉంటారేమో. రాజేశ్వరరావు గారు వయసులోనూ పాత్రికేయ అనుభవంలోను నాకంటే పెద్దవారు. ఆంధ్రజనతలో వారు పనిచేసినప్పుడు మూడు నెలలు అక్కడ కొత్తగా చేరిన ట్రైనీ సబ్ ఎడిటర్లలో నేను ఉన్నాను. మార్పు గోపీనాథ్, జి. శ్రీరామమూర్తిగార్లు నన్ను ‘ఆంధ్ర జనతకు’ పరిచయం చేశారు వారు ప్రస్తావించిన శ్రీకారం రాంమోహన్ గారు , నరసింహారావు గారు , రాధాకృష్ణ గారు , రాంప్రసాద్ గారు , సుబ్బారావు , రంగాచారి నాకు బాగా తెలుసు. తరువాత నేను ప్రజాతంత్ర , ఆంధ్రప్రభల్లో చేరి బెంగళూరులో, చెన్నై లో పనిచేయటం జరిగింది. రంగాచారి నా తరువాత బెంగళూరులో చేరగా , 1986...